Wednesday 7 September 2011

కవిత్వ కలనేత - సుహాసిని

భూమిక December 2009
 శిలాలోలిత
 ’నేను జీవితంలో ఓడిపోయిన ప్రతీసారి నన్ను ఓదార్చింది, గెలిచిన ప్రతీసారి నా భుజం తట్టింది ఈ అక్షరాలే’ - అని డా|| లక్ష్మీసుహాసిని తన అంతరంగ చిత్రాన్ని మన ముందు ఉంచారు . గతంలో ‘దామదచ్చియ’లో అనే పాటల సంకలనాన్ని కూడా తీసుకొచ్చారు . సుహాసిని తల్లి ‘దర్భా భాస్కరమ్మ’ సాహిత్యరంగంలో గణనీయమైన కృషిచేయడం వల్ల, కేవలం సుహాసినికి  లోకానికి పరిచయం చేయడమేకాక, కవితాక్షరాలను కూడా యిచ్చిన ఖ్యాతి భాస్కరమ్మ గారిది.
 అందుకే సుహాసిని జీవితంలో సాహిత్యం కలగలిసి పోయింది. స్త్రీలపై ఎంతో ఆర్ద్రతతో ఆవేదనతో రాసిన కవితలనేకం. స్త్రీలలో ఆత్మగౌరవాన్ని, దృఢత్వాన్ని కోరుకుందామె.
 ’ఆడవారిమీద సాగే ప్రతీ అణచివేతా అత్యాచారాల మీద
 అక్షరయుద్ధం సాగిస్తాను’ - అంది. (ఆసూంకి కసమ్‌)
 ’మా మెడలు వంచి మూడుముళ్ళు వేశారు నిన్న ఆ మెడలు కోసి ప్రేమించవేం? అంటున్నారివాళ.’ - (రివాజు)
 ఇప్పుడు చెలరేగుతున్న ప్రేమోన్మాదుల ఘాతుకాలన్నింటినీ ఈ అక్షరాలలో పొదిగిన్దీమే .
 ’అందరికీ నువ్‌ తలలో నాలుక
 నీ నాలుక తడారిపోడం మాత్రం ఎవరికీ పట్టదు
 అందరి నవ్వులకూ ఆలంబన నువ్వు
 కానీ ఎవరికీ పట్టదు కరవైన నీ నవ్వు’ (ఓ గృహిణి మాత్రమే)
 ఇలా ఎంతకాలం నుంచో మగ్గిపోతున్న స్త్రీల జీవితాలను ఆవిష్కరిస్తూ - ఇంకో కవితలో..
 ’ఉద్వేగాలను అదుపు చేసుకునే
 చైతన్యాన్ని కోల్పోతున్న మీ పురుషాహంకారం మీదనే
 మా నిరసన
 మాతో చెయ్యి కలిపి పోరాడాల్సిన మీరు
 మీ జాత్యహంకారం విడిచి మా నినాదాన్ని వినండి
 మేం ముక్త కంఠంతో గర్హిస్తున్నాం
 ’ఇంకానా ఇకపై సాగదని’ -
 చాలా స్పష్టమైన అవగాహన వున్న కవయిత్రి అవడంవల్ల పురుషులమీద కాదు విమర్శ - పురుషాహంకారం పట్లనే మా నిరసన అంటుంది.
 మానవస్వభావాల్లో మార్పు రావాలని, స్త్రీపురుషలిరువురూ సమానులనీ, స్త్రీలపై హింస ఇంకా కొనసాగకూడదనీ - ఆశావహ దృక్కోణాన్ని కవిత్వీకరించింది.
 లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూండడంవల్ల విద్యార్థులతో సన్నిహితంగా మెసిలే వీలున్నందువల్ల విద్యావిధానంపై కొన్ని కవితలున్నాయి. పాఠ్యాంశాలలోని లోటుపాట్లనీ, అవి చెప్పాల్సి రావడం పట్ల నిరసననీ, విద్యార్థుల మనోవికాసాలకు పనికిరాని పాఠాల్ని కూడా, ఎంతో కష్టపడి మార్చి చెప్పాల్సివస్తున్న స్థితినీ, వాటిని కూడా విద్యార్థులలో విలువల్ని పెంచే దిశగా బోధిస్తున్న విధానాన్ని కవిత్వంలో చెప్పారు .
 ’చెలకుర్తి’ సంఘటనపై స్త్రీలపై హింస పరాకాష్టను చేరుకున్న దృశ్యాన్నీ, కోల్పోతున్న బాల్యాల్నీ, విప్లవమే, ఆ మార్గమే సమస్థితిని తీసుకొస్తుందన్న నమ్మకాన్నీ, ద్రోణాచార్యుడు నరికిన బొటనవేలు గురించి కాదు - ‘చిటికినవేలు కుట్ర’ సంగతేమిటి? ఆ రోజునుంచీ స్త్రీల స్వేచ్ఛ, సంతోషం ఆఖరంటుంది. పసిపిల్లల దైన్యస్థితినీ, పసిపిల్లల బండెడు పుస్తకాల్నీ, రైతుల కడగండ్లు కురిసే వడగండ్లనూ, ఇలా వివిధ సామాజికాంశాలన్నింటినీ కవిత్వంగా  మలిచింది.
 ’రెక్కలు పొదిగిన చూపు’ - పేరు కవిత్వ సంకలనానికి పెట్టడంలోనే, ఒకరికన్ను మరొకరికి ఎలా వెలుగవుతుందో, చెప్తూనే, చూపు సాధించుకున్న స్వేచ్ఛనూ, మరణరాహిత్యాన్ని చెప్పింది. భావస్వేచ్ఛ సాధించినప్పుడు, స్త్రీలు సంఘటితమై బలోపేత మైనప్పుడూ, పురుషుల స్వభావాల్లో పరిపూర్ణమైన మార్పు వచ్చినప్పుడూ, మనం కలలు కనే భావిజీవితం మనముందే ఉందని చెప్పిన ఆశావాది సుహాసిని.

No comments:

Post a Comment