Friday 2 December 2011

పద్మలత పలవరింత, కలవరింత-’మరోశాకుంతలం’

భూమిక April 2010
శిలాలోలిత
శకుంతల ప్రకృతిలో పూచిన పువ్వు. అడవి సౌందర్యం ఆమె సొత్తు. కల్లాకపటం మాయామర్మం తెలీని, అణువణువున ప్రేమను నింపుకున్న అద్భుతమైన సౌందర్యాన్ని ప్రోది చేసుకున్న సీతాకోకచిలుక.కణ్వ మహర్షి ప్రేమామృత ధారలలో తడిపిన పద్మం. అలాంటి శకుంతల  దుష్యంతుని ప్రేమోద్దీపనలతో గొప్ప రసానందాన్ని అనుభవించింది. ప్రేమ తప్ప మరేదీ జీవితంలో శాశ్వతం కాదని నమ్మింది. తనను గుర్తించ నిరాకరించిన దుష్యంతునితో, ఆత్మగౌరవపోరాటం చేసింది. ఒక అద్భుతమైన వ్యక్తిత్వమున్న స్త్రీగా, ఆత్మాభిమానానికి నిదర్శనంగా  నిలిచింది. అలనాటి ఆ శకుంతల గాధే ఇప్పుడు ‘మరో శాకుంతలం’గా మన ముందుకొచ్చింది. ‘పద్మలత’ ఈ కవితాక్షరాలనన్నింటినీ ‘మరో శాకుంతలం’గా ఒక్క  చోట చేర్చి మననీ చూడమంది. అబ్బూరి ఛాయాదేవిగారు ఫోన్‌ చేసి ‘మరో శాకుంతలం’ మీద అభిప్రాయం రాయకూడదూ’ అన్నారు. పుస్తకం చేతిలోకి తీసుకోగానే, జింక పిల్లల్లాంటి, కుందేటి మెత్తని చర్మం లాంటి చేపపిల్లల కదలికల్లాంటి, పారిజాతపు పరిమళాల్లాంటి, పదునైన బాకుల్లాంటి, నలిగిన మల్లెపువ్వుల్లాంటి అక్షరాలు, ఉద్వేగ భరిత ఊహాలోకాల్లోకి, పద్మలత కవిత్వంలోకి లాక్కెళ్ళి పోయాయి. చాలాకాలం తర్వాత ఒక ఫ్రెష్‌ పొయిట్రిని చదివిన అనుభూతి కలిగింది. ‘రేవతీదేవి’ స్ఫురించింది. రేవతీదేవి 79 లో రాసిన ‘శిలాలోలిత’ కావ్యం తర్వాత మళ్ళీ 2010లో పద్మలత ఒక ఉద్వేగ సంభాషణను మన ముందుంచింది.
ఒక హృదయం, మరో హృదయాన్ని స్వచ్ఛంగా, ప్రేమోన్మత్తతతో ఆలింగనం చేసుకోవడానికి పడే తపన ఇందులో ప్రతి అక్షరంలోనూ కన్పించింది. రేవతీదేవి కవిత్వానికీ పద్మలత కవిత్వానికీ చాలా దగ్గర పోలికలున్నాయి. నిజాయితీగా నిర్భయంగా ఏ సెన్సారింగుకు లోబడకుండా, సంఘర్షణ నిండిన భావసంపదతో మనముందు కవిత్వాన్నుంచడం, శారీరక సంచలనాల సవ్వడులను మళ్ళీ మళ్ళీ అనుకోవడానికే తమ గుండెకు సైతం పరదాలేసుకునే ధోరణికాక, ఏ ఆచ్ఛాదనలు లేకుండా ఆరు బయట ఆకాశంకింద మెరిసే నక్షత్రాల్లాంటి నిజాయితీతో కూడిన అక్షరాలకు ప్రాణం పోశారు. ‘జీన్‌పాల్‌ సార్త్రే’ ప్రభావం రేవతీదేవి మీద బలంగా వుంది. పద్మలతలోనూ ఆ ఛాయలు కన్పించాయి.
ఈ ‘మరో శాకుంతలం’శీర్షికలు లేవు. అంతా ఒక శరీరమే ఒక నిర్మాణమే. కాని చెపుతున్న అంశానికి ప్రత్యేక కోణం మాత్రం వుంది. ఏ ఒక్కటీ విడివిడి కవితలుగా కాక, అన్నింటా ఏక సూత్రతే వుంది. కవిత్వమందామా? జీవితమందామా? కొన్ని లక్షల స్త్రీల హృదయాంతర్గత వేదనా రూపమందామా? ఏదైనా అనుకోవచ్చు. ఎవరికి కావలసిన అక్షరాన్ని, అర్ధాన్ని వాళ్ళు తీసుకోవచ్చు.
నిజానికి చిన్న చిన్న పదాలతో లోతైన భావాన్ని వ్యక్తీకరించడం చాలా కష్టం. పద్మలత చాలా మామూలు మాటల్తో, వాక్యాల్తో, ఉద్దీపన కలిగించే భావాల్తో, దేన్నయినా సాధించగలం అనే స్పష్టమైన అవగాహనతో ఈ కవిత్వం మనముందుంచింది. స్త్రీని బలహీన మనస్కురాలుగా కాక, ఒక బలమైన మనిషిగా, ఆత్మవిశ్వాసమున్న మూర్తిగా నిలిచిన ఎదిగిన క్రమాన్ని ఈ కవిత్వంలో పొదిగింది.
ప్రేమంటే ఏకపక్షం కాదనీ, కోరికంటే కేవలం కామవాంఛేకాదనీ, స్త్రీ పురుషులు ఒకరిపట్ల ఒకరు గొప్ప ప్రేమ భావనతో, సృష్టికందని ఆనందాన్ని పొందే గొప్ప రసైకచర్య అని భావించింది. ఆమెలోని వేదాంతి పైపై మెరుగుల మాలిన్యాలనన్నింటినీ క్షాళనం చేయాల్సిన అవసరాన్ని చెప్పింది. ప్రేమే జీవితానికి వెలుగు. ఈ సృష్టిలో డబ్బుతో దేన్నయినా సాధించవచ్చు అనుకుంటారు. కానీ కాదు. ప్రేమనూ, గురువునూ మాత్రం డబ్బుతో పొందలేం’ - ఇదే భావననూ, ప్రేమ రాహిత్యం మనిషినెంత ఉద్వేగానికి గురి చేస్తుందో ఈమె కవిత్వం చెబుతుంది. ఎంతో లలితమైన పదాలు పట్టుకుంటే, ముట్టకుంటే నొప్పి కలుగుతుందేమో అన్నంత భావసౌకుమార్యం, ప్రాచీన సాహిత్యాన్నీ,  చలం లాంటి ఆధునికుల్నీ తనలో ఇముడ్చుకున్న ఈ కవయిత్రి పలవరించినవన్నీ కవితలై  కూర్చున్నాయి. ఈమె కవిత్వంలో స్థలకాలాల పరిమితి లేదు. అందువల్ల శాశ్వతంగా  నిలిచే పోయే గుణం వచ్చింది.
గుండ్రంగా తిప్పి/కావాల్సినవైపు/కాస్తకాస్తగా/ కోసుకోవడానికి/ నేను మనిషిని.
వెలుతురొచ్చిన ఉత్సాహంతో/బుర్రంతా కడగానా/మనసే సాలిపురుగని తెలిసి/ఆ ప్రయత్నం విడిచాను.
ఆశ్చర్యం/మొసళ్ళ మధ్య ఈదుతూ నేనుంటే/ఆనందం ఆ ఒడ్డునచేరి/హాయిగా నవ్వుతోంది. ఇంకెంతలే/ అంతం లేని కాలంలో నేనెంత/ ఇవాళే నిజం కానపుడు/రేపటి గురించి/ వివాదమెందుకు.
నీవు విడిచివెళితే/ ఘనీభవించి/మళ్ళీ మనిషైయ్యాను.
ఓటమిని పద్మలత కవిత్వం అంగీకరించదు. అనేక పార్శ్యాలలో జీవితాన్ని దర్శించిన తర్వాత, ఆటుపోటులకు గురైన స్త్రీమూర్తి, తన జీవితాన్ని కాంతిమయం చేసుకున్న తీరును ఈ కవిత్వం ప్రతిఫలించింది. మనిషిగా జీవించడమే ప్రధానం. స్వేచ్ఛ ఆయువుపట్టు. ప్రేమ ఒక్కటే నిజం. జీవితం చాలా చిన్నది. ఎదురైన ఘర్షణలతో, అపజయాలతో ఎదురొడ్డి నిలిచి సాధించుకున్న వెలుగు జీవితానికర్ధం అన్న జీవన వాస్తవికతలనెన్నింటికో ఆలవాలమైంది ఈ కవిత్వం. సుకుమారమైన స్థితి నుండి ఘనీభవరూపం వరకు సాగిన మానవ యాత్రే ఈ కవిత్వం. మజిలీ మజిలీలో మనిషి సాధించుకోవాల్సిన జీవనమూల్యాన్ని తెలియజెపుతుంది ఈ కవి

Thursday 20 October 2011

ఆకుపచ్చని కల-రాజేశ్వరి దివాకర్ల కవిత్వం

ఆకుపచ్చని కల-రాజేశ్వరి దివాకర్ల కవిత్వం

భూమిక September 2010
శిలాలోలిత
”కవిత్వం అభిరుచికి సంబంధించిన విశిష్ట కళ. రాయకుండా ఉండలేక పోవడమే కవిత్వానికి మూలసూత్రం. వచన కవిత్వానికి నిర్దిష్ట సూత్రాలంటూ ఏమీ లేవు. అంతరంగ మథనమే వచన కవితకు ఆధారం”- రాజేశ్వరి దివాకర్ల.
ఇవే భావాలతో నిత్య నూతనమైన కవిత్వ రచనలో కొత్త కోణాలను దర్శించాలనే తపన రాజేశ్వరిగారి కవిత్వంలో కనిపిస్తుంది. 2009లో ‘భూమి తడిపిన ఆకాశం’ అనే కవిత్వ సంపుటిని తీసుకొని వచ్చారు.
ఈమె ఉభయ భాషా కవయిత్రి. మూడు దశాబ్దాలుగా బెంగుళూరులోని తెలుగు సాహిత్య రంగంలో సృజనాత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. తెలుగు కన్నడాల గురించి తులనాత్మకమైన వ్యాసాలు రాశారు. ఇంతకు ముందు ‘నీరు స్తంభించిన వేళ, ‘నక్షత్ర దాహం’- కవిత్వ సంపుటులను తీసుకొచ్చారు.ఈ మూడింటి పేర్లతో ప్రకృతి, ఆకాశం,నక్షత్రాలు, నీరు, సమయం, స్తబ్ధత, తృష్ణ, పిపాస, భూమి, ఆర్ద్రత మొదలైనవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ మాలికలో ఈమె రచించిన ‘అక్క మహాదేవి’ ప్రచురితమైంది. అలాగే ‘బసవన్న సమగ్ర వచనాలు’ తెలుగు అనువాదాన్ని అంబికా అనంత్‌తో కలిసి చేశారు. స్త్రీ శరణుల వచనాలు’ అనువాదంలో భాగస్వామ్యం వహించారు. రాజేశ్వరి బసవ సమితి వారి ‘బసవ పథం’ త్రైమాసిక తెలుగు పత్రికకు ప్రధాన సంపాదకులుగా వున్నారు. ‘చైతన్య కవిత’ పత్రికకు చేదోడుగా వున్నారు.బెంగుళూరు ప్రభుత్వ కళాశాలో ఆచార్య పదవిని నిర్వహించి నివృత్తిని పొందారు. మంచి వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్నారు. స్త్రీ సంవేదన ప్రధానంగా కవిత్వం రాస్తున్న రాజేశ్వరి మార్దవమైన అభివ్యక్తికి వర్తమాన నిదర్శనంగా వున్నారు.
బెంగుళూరు విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో మొదటి మహిళగా పిహెచ్‌.డి.ని పొందారు. రాజేశ్వరి తండ్రిగారు సుప్రసి ద్ధులైన దివాకర్ల వేంకటావధానిగారు అవడంవల్ల అటు ప్రాచీన సాహిత్యంపై పట్టును సాధించగలిగారు. ఆధునికసాహిత్యంపట్ల మమకారాన్ని, అనువాద రచనలపట్ల మక్కువను చూపగలుగు తున్నారు.
రచయిత్రుల మీద రాసిన కవిత ‘నిన్నటివాళ్ళు’ లో ‘రాసుకునేందుకు/ కాగితం కలమైనా లేకున్నా/ గడ్డిపోచనందుకుని/వెలుగుదారిని వెతికారు/గృహస్వేద మాధ్యమంలో/ అక్షరాలను ఒత్తిడి చేశారు/… బాలవితంతువులు/ఆత్మదు:ఖగాయాలను/ శరీరం పిట్టగోడ మీద ఆరేసుకున్నారు./.. మార్పు రావలసిన కాలాలకు/ సాక్ష్యంగా నిలిచారు’.
ఒక సామాజిక బాధ్యతగా రచనను స్వీకరించి స్త్రీల జీవితాల్లోని చీకటి కోణాలను, అసమానతలను వివరిస్తూ రచించడాన్ని సమర్ధించారు. ‘ఆత్మధైర్యం అవతరించాలి/..స్వయంసిద్థ వ్యక్తిత్వం/ నాతోడుగ నిలవాలి/ నేను ఒంటరిని కానని/ నిరూపించాలి/ అనేక పుట్టుకలతో నేను ఒక్కటి కావాలి, స్త్రీలలో ఏర్పడిన చైతన్యం శిశిరపు అంచుల్ని ఒడిసి పట్టుకొని కవిత్వీకరించారు.
పదవీ విరమణ రోజున తన మనస్సులోని మానసిక సంచలనాన్నింటినీ ‘మెట్లు దిగుతూ’.. కవిత్వంలో ఎంతో ఆర్ద్రంగా రచించారు. విదేశాలకు వలస వెళ్ళి పోయిన పిల్లల్ని తలుచుకుంటూ, శరీర మాత్రులు మిగిలున్న వాళ్ళు ‘ఊటలేని చిరునవ్వు’ని కంటి ముందు నిలిపారు. సాలీడు అల్లుకున్న గూట్లో/ తానే చిక్కుపడినట్లు/ అధిక ధరలను చుట్టూ పేర్చుకుని/ గుండెదడను పెంచుకుంటుంది/తరగతుల భావనను వదిలి/మనోగతిని దిద్దుకుంటే/వజ్రా యుధంకాదా/ మధ్యతరగతి మహిళ-జీవన నిర్ణయాన్ని తీసుకునే శక్తి స్త్రీలకుందని నిర్ణయ ప్రకటన చేస్తుంది. తనను తాను తరచి చూసుకున్నప్పుడే, నిజమైన వ్యక్తిత్వం ఏర్పడుతుందని భావించి- ‘నాతో నేను మాట్లాడుకునే/ సందర్భంలో మాత్రం/ నన్ను నేను నిలదీసుకుంటాను, అంటున్నారు? ‘ఆమె - అతడు’ వ్యంగ్య కవిత. కల్పనా చావ్లా మీదా, ఉద్యోగస్థురాలి పిల్లల ఒంటరితనం మీద, తండ్రిని కోల్పోయిన పిల్లల మానసిక స్థితిని, చిత్రిస్తూ కవిత లున్నాయి. చివరికి మిగిలేది? భూమి తడిపిన ఆకాశం, ఒకరినొకరు, రెండు అద్దాలు ఒకే దృశ్యం, పొద్దుటి వెన్నెల, అలిప్త బిందువు వంటి మంచి కవితలున్నాయి. చివరగా రాజేశ్వరి కవిత్యోద్దేశ్యాన్ని తెలిపిన మంచి కవితొకటుంది. ‘విరోధా భాసం’-అది. ‘నాలోపలి దిగులు, భయాలను / ఎదిరిస్తుంటాను/ శిఖరాలను ఎక్కాలని కాదు/ భూమిపై నా కాళ్ళను గట్టిగా నిలపాలని/ నేనంత దూరం నడవలేనని/ జాలి చూపిన వాళ్ళను దూరం నిలిపి/ ముందుకు పోవాలన్న /ధ్యేయంతో తలపడుతుంటాను?.
రాజేశ్వరి కవిత్వం ఒక భావోద్విగ్నతకు గురి చేస్తుంది. ఆమె ‘లో చూపు’, ‘చుట్టు చూపు’ ఆమె పరిణిత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మంచి అనువాదకురాలిగా పేర్గాంచిన ఆమె సాహితీ ప్రయాణం ఈ విరామ సమయంలో ద్విగుణీతమవ్వాలని ఆశిస్తున్నాను. సరళమైన భాషతో, చిక్కని భావాలతో, స్పష్టమైన అవగాహనతో రచించిన రాజేశ్వరి సర్వదా అభినందనీయురాలే.

Friday 30 September 2011

ఆకుపచ్చని కల-రాజేశ్వరి దివాకర్ల కవిత్వం

భూమిక September 2010
శిలాలోలిత
”కవిత్వం అభిరుచికి సంబంధించిన విశిష్ట కళ. రాయకుండా ఉండలేక పోవడమే కవిత్వానికి మూలసూత్రం. వచన కవిత్వానికి నిర్దిష్ట సూత్రాలంటూ ఏమీ లేవు. అంతరంగ మథనమే వచన కవితకు ఆధారం”- రాజేశ్వరి దివాకర్ల.
ఇవే భావాలతో నిత్య నూతనమైన కవిత్వ రచనలో కొత్త కోణాలను దర్శించాలనే తపన రాజేశ్వరిగారి కవిత్వంలో కనిపిస్తుంది. 2009లో ‘భూమి తడిపిన ఆకాశం’ అనే కవిత్వ సంపుటిని తీసుకొని వచ్చారు.
ఈమె ఉభయ భాషా కవయిత్రి. మూడు దశాబ్దాలుగా బెంగుళూరులోని తెలుగు సాహిత్య రంగంలో సృజనాత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. తెలుగు కన్నడాల గురించి తులనాత్మకమైన వ్యాసాలు రాశారు. ఇంతకు ముందు ‘నీరు స్తంభించిన వేళ, ‘నక్షత్ర దాహం’- కవిత్వ సంపుటులను తీసుకొచ్చారు.ఈ మూడింటి పేర్లతో ప్రకృతి, ఆకాశం,నక్షత్రాలు, నీరు, సమయం, స్తబ్ధత, తృష్ణ, పిపాస, భూమి, ఆర్ద్రత మొదలైనవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ మాలికలో ఈమె రచించిన ‘అక్క మహాదేవి’ ప్రచురితమైంది. అలాగే ‘బసవన్న సమగ్ర వచనాలు’ తెలుగు అనువాదాన్ని అంబికా అనంత్‌తో కలిసి చేశారు. స్త్రీ శరణుల వచనాలు’ అనువాదంలో భాగస్వామ్యం వహించారు. రాజేశ్వరి బసవ సమితి వారి ‘బసవ పథం’ త్రైమాసిక తెలుగు పత్రికకు ప్రధాన సంపాదకులుగా వున్నారు. ‘చైతన్య కవిత’ పత్రికకు చేదోడుగా వున్నారు.బెంగుళూరు ప్రభుత్వ కళాశాలో ఆచార్య పదవిని నిర్వహించి నివృత్తిని పొందారు. మంచి వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్నారు. స్త్రీ సంవేదన ప్రధానంగా కవిత్వం రాస్తున్న రాజేశ్వరి మార్దవమైన అభివ్యక్తికి వర్తమాన నిదర్శనంగా వున్నారు.
బెంగుళూరు విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో మొదటి మహిళగా పిహెచ్‌.డి.ని పొందారు. రాజేశ్వరి తండ్రిగారు సుప్రసి ద్ధులైన దివాకర్ల వేంకటావధానిగారు అవడంవల్ల అటు ప్రాచీన సాహిత్యంపై పట్టును సాధించగలిగారు. ఆధునికసాహిత్యంపట్ల మమకారాన్ని, అనువాద రచనలపట్ల మక్కువను చూపగలుగు తున్నారు.
రచయిత్రుల మీద రాసిన కవిత ‘నిన్నటివాళ్ళు’ లో ‘రాసుకునేందుకు/ కాగితం కలమైనా లేకున్నా/ గడ్డిపోచనందుకుని/వెలుగుదారిని వెతికారు/గృహస్వేద మాధ్యమంలో/ అక్షరాలను ఒత్తిడి చేశారు/… బాలవితంతువులు/ఆత్మదు:ఖగాయాలను/ శరీరం పిట్టగోడ మీద ఆరేసుకున్నారు./.. మార్పు రావలసిన కాలాలకు/ సాక్ష్యంగా నిలిచారు’.
ఒక సామాజిక బాధ్యతగా రచనను స్వీకరించి స్త్రీల జీవితాల్లోని చీకటి కోణాలను, అసమానతలను వివరిస్తూ రచించడాన్ని సమర్ధించారు. ‘ఆత్మధైర్యం అవతరించాలి/..స్వయంసిద్థ వ్యక్తిత్వం/ నాతోడుగ నిలవాలి/ నేను ఒంటరిని కానని/ నిరూపించాలి/ అనేక పుట్టుకలతో నేను ఒక్కటి కావాలి, స్త్రీలలో ఏర్పడిన చైతన్యం శిశిరపు అంచుల్ని ఒడిసి పట్టుకొని కవిత్వీకరించారు.
పదవీ విరమణ రోజున తన మనస్సులోని మానసిక సంచలనాన్నింటినీ ‘మెట్లు దిగుతూ’.. కవిత్వంలో ఎంతో ఆర్ద్రంగా రచించారు. విదేశాలకు వలస వెళ్ళి పోయిన పిల్లల్ని తలుచుకుంటూ, శరీర మాత్రులు మిగిలున్న వాళ్ళు ‘ఊటలేని చిరునవ్వు’ని కంటి ముందు నిలిపారు. సాలీడు అల్లుకున్న గూట్లో/ తానే చిక్కుపడినట్లు/ అధిక ధరలను చుట్టూ పేర్చుకుని/ గుండెదడను పెంచుకుంటుంది/తరగతుల భావనను వదిలి/మనోగతిని దిద్దుకుంటే/వజ్రా యుధంకాదా/ మధ్యతరగతి మహిళ-జీవన నిర్ణయాన్ని తీసుకునే శక్తి స్త్రీలకుందని నిర్ణయ ప్రకటన చేస్తుంది. తనను తాను తరచి చూసుకున్నప్పుడే, నిజమైన వ్యక్తిత్వం ఏర్పడుతుందని భావించి- ‘నాతో నేను మాట్లాడుకునే/ సందర్భంలో మాత్రం/ నన్ను నేను నిలదీసుకుంటాను, అంటున్నారు? ‘ఆమె - అతడు’ వ్యంగ్య కవిత. కల్పనా చావ్లా మీదా, ఉద్యోగస్థురాలి పిల్లల ఒంటరితనం మీద, తండ్రిని కోల్పోయిన పిల్లల మానసిక స్థితిని, చిత్రిస్తూ కవిత లున్నాయి. చివరికి మిగిలేది? భూమి తడిపిన ఆకాశం, ఒకరినొకరు, రెండు అద్దాలు ఒకే దృశ్యం, పొద్దుటి వెన్నెల, అలిప్త బిందువు వంటి మంచి కవితలున్నాయి. చివరగా రాజేశ్వరి కవిత్యోద్దేశ్యాన్ని తెలిపిన మంచి కవితొకటుంది. ‘విరోధా భాసం’-అది. ‘నాలోపలి దిగులు, భయాలను / ఎదిరిస్తుంటాను/ శిఖరాలను ఎక్కాలని కాదు/ భూమిపై నా కాళ్ళను గట్టిగా నిలపాలని/ నేనంత దూరం నడవలేనని/ జాలి చూపిన వాళ్ళను దూరం నిలిపి/ ముందుకు పోవాలన్న /ధ్యేయంతో తలపడుతుంటాను?.
రాజేశ్వరి కవిత్వం ఒక భావోద్విగ్నతకు గురి చేస్తుంది. ఆమె ‘లో చూపు’, ‘చుట్టు చూపు’ ఆమె పరిణిత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మంచి అనువాదకురాలిగా పేర్గాంచిన ఆమె సాహితీ ప్రయాణం ఈ విరామ సమయంలో ద్విగుణీతమవ్వాలని ఆశిస్తున్నాను. సరళమైన భాషతో, చిక్కని భావాలతో, స్పష్టమైన అవగాహనతో రచించిన రాజేశ్వరి సర్వదా అభినందనీయురాలే.

Wednesday 21 September 2011

జాలాది విజయ స్వచ్ఛమైన కవిత్వాక్షరాలు


భూమిక October 2010
శిలాలోలిత
డా.జాలాది విజయ ‘నగ్నాక్షరాలు’ అనే పేరిట కవితా సంపుటిని 2008లో వేశారు. రగులుతున్న దు:ఖంతో వున్న స్త్రీ ముఖ చిత్రంతో పోరాట పటిమను కనబరుస్తున్న దృశ్యాన్ని అక్బర్‌ అద్భుతంగా చిత్రించారు. కృష్ణాజిల్లా పులపర్రులో జన్మించిన ఈమె ప్రస్తుతం, శ్రీ సిద్ధార్థ విద్యా సంస్థలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తన కన్న తండ్రి జానపద మహాకవి ఐన ‘జాలాది’పై ఎం.ఫిల్‌, పి.హెచ్‌డి చేశారు.
ఈ కవిత్వంలో రకరకాల భావాల సమ్మేళనం వుంది. వస్తువైవిధ్యం వుంది. స్త్రీల సమస్యలపై జీవితాలపై రాసిన కవితలలో కత్తికంటె పదునైన భావతీవ్రత వుంది.భావగాఢతా వుంది. ప్రేమ, విరహం నిరీక్షణ వంటి కవితలు ప్రారంభంలో రాసినవై వుంటాయి. వాటిల్లో కొంత సరళత, మామూలు ధోరణే వున్నాయి. కానీ, స్త్రీల మానసిక ఘర్షణను చిత్రించేటప్పుడు మాత్రం కవయిత్రి విజయ ఒక ప్రవాహ వేగంతో రచిస్తూ, పోలికలపై పోలికలు చెబ్తూ పోయారు.
ముందుగా, ‘ఎందుకు’? కవిత గురించి మాట్లాడుకుందాం. మహిళా దినోత్సవాలు జరుపుకోవడం ఎందుకు? అని ప్రశ్నిస్తూ ఉధృతమైన ఆవేశంతో రాసిన కవిత ఇది. డబ్బున్న స్త్రీలపై, అగ్రకులాలలో వున్న స్త్రీల (కొందరు మాత్రమే, అంటే ఒకళ్ళిద్దరే)పై దాడి సరైంది కాదు. వస్త్రధారణ అనేది వ్యక్తిగతం. స్త్రీలందరం ఒకటనుకోవాలి. స్త్రీలకంటే ముందు మనం మనుష్యులం. మానవత్వం వున్న వ్యక్తులం. మనలో మనకి విభేధాలు సృష్టించాలను కునే వాళ్ళకు మన మాటలే ఆయుధాలౌతాయి. అతి ధోరణిని ప్రదర్శించే ఒకళ్ళిద్దరు స్త్రీల గాటన  అందరి స్త్రీలను కట్టడం ధర్మం కాదు. పుట్టుక మన చేతుల్లో లేదు. పుట్టిన తర్వాత ఎలా జీవిస్తున్నాం. ఎలాంటి భావాలున్నాయి అన్నది ప్రధానం. ఇంత మంచి పరిణితి వున్న కవయిత్రి గళంలో ఇలాంటి నిరసన బాధాకరం అన్పించింది. ‘నేను స్త్రీవాదిని కాను అమ్మవాదిని’ అని ప్రకటించారొక కవితలో. స్త్రీవాదమంటే అదొక  నేరమో, పాపమో, విశృంఖల జీవితమో కాదు. ఆత్మగౌరవ పోరాటం. మన చుట్టూ వున్న కోట్లాది స్త్రీల సమానత్వం కోసం, అస్తిత్వంకోసం, ఆర్థిక దోపిడీని నిరోధించడం కోసం, ఆరాట పడ్తూ పోరాడుతున్నదే స్త్రీవాదం. స్త్రీలలో వున్న బహురూపాల్లో అమ్మరూపం ఒకటి. మాతృత్వ ప్రదర్శన, త్యాగాల కిరీటాలు మోయడమే స్త్రీతత్వం కాదు. మానవత్వాన్ని స్త్రీ పురుషులిరువురూ నింపుకుని, సాటి మనుషులుగా గుర్తించమనే చెబ్తోంది. ఇవన్నీ విజయగారికి తెలియవని కాదు. ఈ దృష్టితో ఆలోచిస్తే, మనమంతా ఒకటనే భావన పెంపొందించుకొంటే ఇంకెన్నో మంచి కవితలు రాయాలని, రాస్తారని నా నమ్మకం. రావూరి భరద్వాజగారి ముందుమాటలో, డా. జయరావుగారి వెనకమాటలో కూడా  ”ఇది స్త్రీవాదం కాదు, అమ్మవాదం’ అంటూ ప్రస్తావించారు. అమ్మవాదం అంటే ఏమిటి? ప్రేమమయమైన స్త్రీ తత్వమనే కదా! స్త్రీవాదం అంటే స్త్రీ చైతన్యమే. స్త్రీల కొరకు పడే తపనే. స్త్రీల సమస్థితి కోసం పోరాటమే. మనని మనం అర్థం చేసుకునే తీరులోనే వుందంతా. పక్కవాళ్ళు రాళ్ళేయడం చూస్తూనే వున్నాం. మన మీద మనమే రాళ్ళేసుకోవద్దనేదే నా భావన.
బతకడానికే రోజుని కోల్పోయిన స్త్రీలు, అలమటిస్త్తూ, ఆరాటపడ్తూ, పోరాడుతున్న స్త్రీలు, తమ విజయాల్ని, తాము సాధించుకున్న హక్కుల్ని తాము పొందుతున్న భావస్వేచ్ఛనూ, నిర్ణయ ప్రకటనల్ని వెలిబుచ్చుకునే రోజుగా, తాము సాధించుకున్న రోజుగా మహిళా దినోత్సవాన్ని ఎందుకు అనుకోకూడదు?
విజయ తన కవిత్వతత్వాన్ని గురించి ఎంతో భావోద్వేగంతో ‘జ్వాలితాక్షరాలు’ అంటూ చెప్పారు.’నడిబొడ్డున పెట్టిన పొలికేక హోరు నా జాతి గుండెలో మండుతున్న అగ్ని కణాల జ్వాల మదిని ముంచుతున్న కన్నీటి ప్రవాహాల సుడిగుండాల ఉప్పెన. క్షణక్షణం వేధిస్తూ నా చుట్టూ ముసురుకున్న జవాబులేని ప్రశ్నలు. మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న మనస్సు మూలుగు నాతోబుట్టువుల రుధిరాక్షర సంతకాలే ఈ ‘నగ్నాక్షరాలు’. నాలో ఉబుకుతున్న.. ఉరుకుతున్న ఎర్రకణాల ఉప్పెనే ఈ ‘నగ్నాక్షరాలు’. ఆక్రోశంతో అలసిన మనసుతో మీ ముందుకు వస్తున్న అలుపెరగని పోరాటం చేస్తున్నా. సరిలేని నెత్తుటి బిందువుని సవరించే చిరు ప్రయత్నం.’ ఆమెకున్న సంస్కారం, తపన, ఆర్తి, వినయం మన కిందులో ప్రస్ఫుటమౌతున్నాయి.
విజయ వాళ్ళ నాన్న మీద రాసిన కవిత ‘రుద్రాక్షరం’. అత్యుత్తమైన జానపద సాహిత్యాన్ని అద్భుతంగా రచించిన ప్రజలకవి ఆయనంటే నాకెంతో గౌరవం కూడా. ‘బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తెలుసుకో/ గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో’-లాంటి వాస్తవ సత్యాలెన్నింటినో ఎంతో కరుణార్ద్రంగా వెల్లడించారు.
ఆశ, ఆఖరి ప్రయాణం, నీలాగే , రాజీనామా, నమ్మకం మోసపోయింది, శూన్యమైన మనస్సు మీద, మృత్యుతరంగాలు, కలల మేడలు, అంతిమ విజయం ఎవరిది? ఎదురు చూపు, అమృతవర్షం, నా అక్షరాల సాక్షిగా వంటి మంచి కవితలెన్నో ఇందులో వున్నాయి. ‘మరో ప్రపంచంకోసం’ కలలు కంటూ ఆశావహ దృక్పథంతో ఈ కవయిత్రి ఎదురు చూస్తోందిలా.
‘ఇంకిన బిందువులా/ ఇంకుతున్న బంధువులా/ జంకులేని నెత్తురు బిందువులా/ మరో ప్రపంచంకోసం/ ఎదురుచూస్తున్నా!

Wednesday 7 September 2011

కవిత్వ కలనేత - సుహాసిని

భూమిక December 2009
 శిలాలోలిత
 ’నేను జీవితంలో ఓడిపోయిన ప్రతీసారి నన్ను ఓదార్చింది, గెలిచిన ప్రతీసారి నా భుజం తట్టింది ఈ అక్షరాలే’ - అని డా|| లక్ష్మీసుహాసిని తన అంతరంగ చిత్రాన్ని మన ముందు ఉంచారు . గతంలో ‘దామదచ్చియ’లో అనే పాటల సంకలనాన్ని కూడా తీసుకొచ్చారు . సుహాసిని తల్లి ‘దర్భా భాస్కరమ్మ’ సాహిత్యరంగంలో గణనీయమైన కృషిచేయడం వల్ల, కేవలం సుహాసినికి  లోకానికి పరిచయం చేయడమేకాక, కవితాక్షరాలను కూడా యిచ్చిన ఖ్యాతి భాస్కరమ్మ గారిది.
 అందుకే సుహాసిని జీవితంలో సాహిత్యం కలగలిసి పోయింది. స్త్రీలపై ఎంతో ఆర్ద్రతతో ఆవేదనతో రాసిన కవితలనేకం. స్త్రీలలో ఆత్మగౌరవాన్ని, దృఢత్వాన్ని కోరుకుందామె.
 ’ఆడవారిమీద సాగే ప్రతీ అణచివేతా అత్యాచారాల మీద
 అక్షరయుద్ధం సాగిస్తాను’ - అంది. (ఆసూంకి కసమ్‌)
 ’మా మెడలు వంచి మూడుముళ్ళు వేశారు నిన్న ఆ మెడలు కోసి ప్రేమించవేం? అంటున్నారివాళ.’ - (రివాజు)
 ఇప్పుడు చెలరేగుతున్న ప్రేమోన్మాదుల ఘాతుకాలన్నింటినీ ఈ అక్షరాలలో పొదిగిన్దీమే .
 ’అందరికీ నువ్‌ తలలో నాలుక
 నీ నాలుక తడారిపోడం మాత్రం ఎవరికీ పట్టదు
 అందరి నవ్వులకూ ఆలంబన నువ్వు
 కానీ ఎవరికీ పట్టదు కరవైన నీ నవ్వు’ (ఓ గృహిణి మాత్రమే)
 ఇలా ఎంతకాలం నుంచో మగ్గిపోతున్న స్త్రీల జీవితాలను ఆవిష్కరిస్తూ - ఇంకో కవితలో..
 ’ఉద్వేగాలను అదుపు చేసుకునే
 చైతన్యాన్ని కోల్పోతున్న మీ పురుషాహంకారం మీదనే
 మా నిరసన
 మాతో చెయ్యి కలిపి పోరాడాల్సిన మీరు
 మీ జాత్యహంకారం విడిచి మా నినాదాన్ని వినండి
 మేం ముక్త కంఠంతో గర్హిస్తున్నాం
 ’ఇంకానా ఇకపై సాగదని’ -
 చాలా స్పష్టమైన అవగాహన వున్న కవయిత్రి అవడంవల్ల పురుషులమీద కాదు విమర్శ - పురుషాహంకారం పట్లనే మా నిరసన అంటుంది.
 మానవస్వభావాల్లో మార్పు రావాలని, స్త్రీపురుషలిరువురూ సమానులనీ, స్త్రీలపై హింస ఇంకా కొనసాగకూడదనీ - ఆశావహ దృక్కోణాన్ని కవిత్వీకరించింది.
 లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూండడంవల్ల విద్యార్థులతో సన్నిహితంగా మెసిలే వీలున్నందువల్ల విద్యావిధానంపై కొన్ని కవితలున్నాయి. పాఠ్యాంశాలలోని లోటుపాట్లనీ, అవి చెప్పాల్సి రావడం పట్ల నిరసననీ, విద్యార్థుల మనోవికాసాలకు పనికిరాని పాఠాల్ని కూడా, ఎంతో కష్టపడి మార్చి చెప్పాల్సివస్తున్న స్థితినీ, వాటిని కూడా విద్యార్థులలో విలువల్ని పెంచే దిశగా బోధిస్తున్న విధానాన్ని కవిత్వంలో చెప్పారు .
 ’చెలకుర్తి’ సంఘటనపై స్త్రీలపై హింస పరాకాష్టను చేరుకున్న దృశ్యాన్నీ, కోల్పోతున్న బాల్యాల్నీ, విప్లవమే, ఆ మార్గమే సమస్థితిని తీసుకొస్తుందన్న నమ్మకాన్నీ, ద్రోణాచార్యుడు నరికిన బొటనవేలు గురించి కాదు - ‘చిటికినవేలు కుట్ర’ సంగతేమిటి? ఆ రోజునుంచీ స్త్రీల స్వేచ్ఛ, సంతోషం ఆఖరంటుంది. పసిపిల్లల దైన్యస్థితినీ, పసిపిల్లల బండెడు పుస్తకాల్నీ, రైతుల కడగండ్లు కురిసే వడగండ్లనూ, ఇలా వివిధ సామాజికాంశాలన్నింటినీ కవిత్వంగా  మలిచింది.
 ’రెక్కలు పొదిగిన చూపు’ - పేరు కవిత్వ సంకలనానికి పెట్టడంలోనే, ఒకరికన్ను మరొకరికి ఎలా వెలుగవుతుందో, చెప్తూనే, చూపు సాధించుకున్న స్వేచ్ఛనూ, మరణరాహిత్యాన్ని చెప్పింది. భావస్వేచ్ఛ సాధించినప్పుడు, స్త్రీలు సంఘటితమై బలోపేత మైనప్పుడూ, పురుషుల స్వభావాల్లో పరిపూర్ణమైన మార్పు వచ్చినప్పుడూ, మనం కలలు కనే భావిజీవితం మనముందే ఉందని చెప్పిన ఆశావాది సుహాసిని.

Friday 26 August 2011

కనకపుష్యరాగం


కనకపుష్యరాగం

భూమిక August 2011
డా.శిలాలోలిత
‘కనకపుష్యరాగం’ - పొణకాకణకమ్మగారి స్వీయచరిత్ర. చరిత్రలో స్వీయచరిత్రరాసిన స్త్రీలు బహుకొద్దిమంది మాత్రమే. చరిత్రకారుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తావనకు కూడా రానివారు అనేకమంది, ఇన్నాళ్ళకైనా, డాక్టరు కాళిదాసు పురుషోత్తంగారు సంపాదకులుగా వుండి ఈ స్వీయచరిత్ర వెలుగుచూడడానికి కారకు లయ్యారు. ఆంధ్రదేశంలో స్వాతంత్య్రోద్యమచరిత్రను రాసే చరిత్ర కారులు, ”నెల్లూరులో పొణకా కనకమ్మ ఖద్దరు గుడ్డలు అమ్మిందనీ, గాంధీజీకి బంగారు గాజులు తీసిఇచ్చిందనీ, ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు వెళ్లిందనీ ”ఒక వాక్యం రాసి మొక్కు తీర్చుకున్నాను. అంతేనా… కనకమ్మ; అదేనా చరిత్రలో ఆమె స్థానం? కాదు. కానేకాదని నిర్ద్వంద్వంగా నిరూపిస్తుందీ స్వీయచరిత్ర. కనకమ్మది కొత్తబాట. తనంతట తానువేసుకొన్న బాట కావడంవల్ల దారిపొడవునా రాళ్ళూ, ముళ్ళూ, ఐనా ఆమె నడక కుంటుపడలేదు. నెల్లూరు జిల్లాలో పోట్లపూడి అనే చిన్నపల్లెలో బాల్యం, యవ్వనం గడిచినా, ఆమె తననుతాను ఆధునిక మహిళగా రూపొందించుకొంది. భూస్వామ్యకుటుంబంలోని ఆంక్షలన్నిట్నీ ఆమె ఎదుర్కొంది. ఐనా సరే ఆమె ఏ క్షణంలోనూ స్థాణువు అయిపోలేదు. జీవితమంతా చైతన్యమే; అలుపెరుగని, ఓటమికి తలవంచని ఒంటరి పోరాటమే. ఈ స్వీయచరిత్రను యథాలాపంగా కాకుండా పరిశీలనాత్మకంగా చదవండి. ఇది వట్టి ఘటనల పోగు కాదు. ఒక్కొక్క సంఘటన వెనక అచంచలమైన కనకమ్మ ఆత్మస్థైర్యం, వ్యక్తిత్వం కనబడతాయి. స్వచ్ఛమైన మంచితనం పలకరిస్తుంది. కంటనీరు పెట్టిస్తుంది. (పేజి 3 - పెన్నేపల్లి గోపాలకృష్ణ) కనకమ్మ చనిపోయినప్పుడు వెన్నెలకంటి రాఘవయ్య ఇట్లా రాశారు. ”కనకమ్మ ఆర్థికకష్టాలతోపాటు మానసిక, శరీరకష్టాలను కూడా ఎన్నిటినో అనుభవించింది. మొదట ఆస్తినష్టము, తరువాత ప్రేమించిన భర్త వియోగము, అనుంగు కుమార్తె అకాలమరణము - వీటన్నింటికన్నా తాను సృష్టించి, పెంచిన కస్తూరిదేవి విద్యాలయము తన పెత్తనము నుండి జారిపోవడము - ఆమె ఆరోగ్యాన్ని ఆయువును కృంగదీసినవి. కనకమ్మది రైతుకుటుంబమే కాని, రాజకీయకుటుంబం కాదు. ఐనా రాజకీయ చైతన్యం ఆమెలో మూర్తీభవించింది. గడపదాటి రాకూడదు; స్వాతంత్య్రోద్యమంలో ఆమె చేపట్టని కార్యక్రమం లేదు. గాంధీజీ ప్రభావానికి ఒదగక ముందు, 1915లో మద్రాసులో ఓ.వి. చిదంబరం పిళ్ళె, గుంటూరులో ఉన్నవలక్ష్మీనారాయణలాంటి తీవ్రవాదులతో చేతులు కలిపి, రహస్యంగా పిస్తోళ్ళు, బాంబులు దిగుమతి చేసుకొని ”సమయం కోసం వేచి వుండిన” సాహసి ఆమె. గాంధీజీ ప్రభావానికి లోనైనతర్వాత ఆమెలో వచ్చిన మార్పును గమనించాలి. హరిజనుల కొరకు పొట్లపూడిలో స్కూలు పెట్టింది. రాట్నం వడికింది, అహింసను ప్రచారం చేసింది. మాదిగవాడలో కలరా సోకితే స్వయంగా చికిత్స చేస,ి మాలవాడలో విషజ్వరాలు ప్రబలితే మందూమాకు అందజేసి ఆదుకుంది. ఖద్దరు బట్టలు భుజాన వేసుకుని నెల్లూరులో వీధివీధి తిరిగి అమ్మింది. కస్తూరిదేవి విద్యాలయం ఆమె మహోన్నత వ్యక్తిత్వానికి సంస్థారూపం. నిరుపేదల, దళిత బాలికల కోసం స్కూలు స్థాపించడం ఆమె ఆశయం. కష్టకాలమంతా ఆమెతోనే గడిచింది. ఆమె ఊహించనంత ఉన్నతంగా సంస్థ పెరిగి, ప్రఖ్యాతికొచ్చిన తర్వాత ధనికస్వాముల పాలైంది. ఈమె రచనావ్యాసంగం ఇరవైఏళ్ళ వయస్సులోనే ఆరంభమైంది. శశిరేఖ, హిందూసుందరి, అనసూయ వంటి పత్రికల్లో పద్యాలు, వ్యాసాలు రాశారు. ‘చెట్టు నీడ ముచ్చట్లు’ పేరుతో వ్యాసాలు రాశారు. 1920 ప్రాంతంలో ‘రాణి పద్మిని’ అనే చారిత్రక నవల రాశారు. హిందీ నుండి తెలుగుకి అనువాదాలు చేశారు. పొణకా కనకమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మలు, తెలుగులో తొలిజంట కవయిత్రులుగా స్తుతిగీతాలు రాశారు. 1920 నుంచి 1935 వరకు అత్యంత సేవాత్యాగాలు చేసిన స్త్రీల ఉద్యమచరిత్రను ప్రత్యేకంగా గ్రంథస్థం చెయ్యాలనే ఆలోచన, ఈ రచయిత్రుల స్త్రీవాదదృక్పథాన్ని తెలియజేస్తోంది. కనకమ్మలోని స్త్రీవాదదృక్పథం ఆమె స్వీయచరిత్ర రచించడానికి పూనుకోవడంలోనే వ్యక్తమైంది. ‘స్త్రీలు రాజకీయాల్లో పాల్గొనవలసినదే’ - స్త్రీలు సంకల్పిస్తే ఎంత పనైనా చేయగలము. ఒక పత్రికా నిర్వహణమునే కాదు రాజ్యాంగమునే శాసించగలము” అని స్త్రీశక్తి మీద గొప్ప విశ్వాసం ప్రకటించారు. పురుషోత్తం గారి కృషి వల్ల కనకమ్మగారి స్వీయచరిత్రను మనం చదవగలుగుతున్నాము. ఇందులో ప్రధానంగా 8 భాగాలున్నాయి. 1. మృత్యోర్మా అమృతంగమయ, 2. ఆ దినాలు ఇంకరావు 3. చీకటివెలుగులు, 4. నా రాజకీయ జీవితం, 5. మహాత్మునితో పరిచయభాగ్యం, 6. ఆశ్రమవాసం, 7. శ్రీ కస్తూరీదేవి విద్యాలయం చరిత్ర, 8. అనారోగ్యపర్వం. నెల్లూరు నగరంలో ఎవరెవరివో విగ్రహాలు వున్నాయి. కానీ కనకమ్మ విగ్రహం లేదు. ఎందుకు? కస్తూరీదేవి విద్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడానికి తయారుచేయబడిన కనకమ్మ కాంస్య విగ్రహం ఆ మూల ఒక చీకటిగదిలో ముప్పయ్యేళ్ళుగా మూలుగుతోంది. ఇప్పటికైనా స్థానికులు వెలికితీసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇది అందరం చదవాల్సిన గొప్ప పుస్తకం. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వమున్న స్త్రీ జీవిత దర్శనమే ఇది.

Wednesday 24 August 2011

స్త్రీల చైతన్యానికి ప్రతీకలు ఈ కథలు

స్త్రీల చైతన్యానికి ప్రతీకలు ఈ కథలు

భూమిక June 2011
డా.శిలాలోలిత
స్త్రీల హక్కులగురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి తన గొంతును వినిపిస్తూ, ఆ దిశలో కృషి చేస్తున్న జీవనయానం ఆమెది. కొండవీటి సత్యవతిలో చిన్నచిన్న సంఘటనలను కథలుగా మలిచే నేర్పు వుంది. తాత్త్వికత, ఆర్ద్రగుణం, స్పష్టత, సూటిదనం ఈమె కథలను, సాధార ణమైన కథలుగా కాక, చర్చనీయాంశమైన కథలుగా నిలుపుతున్నాయి.
పాత్రల్లోకి ప్రవేశించి వాటిలోని ఘర్షణను, నిబద్ధతను రూపొందించే నైపుణ్యం వలన, కథల్లో ఎన్నుకొన్న పాత్రలు ఘర్షణ నుండి ఏర్పడిన తాత్వికాంశతో మన ముందు నిలబడతాయి. తమనుతాము స్థిరంగా నిలుపుకుంటాయి, కథలోని వస్తువును తేలికగా పాఠకుడు అర్థంచేసుకునే సౌలభ్యంతో పాటు, కథకురాలి ప్రాపంచిక దృక్పథమేమిటో  కథల్లో స్పష్టంగా తెలుస్తుంది.
పాఠకుడికి ఇవన్నీ తన చుట్టూ రోజూ జరుగుతున్నవేనని, కన్పిస్తున్నవేననే భావన కలగడంతో పాటు, తాను ఆయా ప్రత్యక్షపరోక్ష సందర్భాల్లో స్పందించి వ్యవహరించే తీరును గుర్తుచేసుకుని, ఆత్మవిమర్శ చేసుకునే అవసరాన్ని  ఈ కథలు కలగజేస్తాయి. దీనివల్ల కథల్ని ఎవరికి వారు తమ కథలుగా, సజీవమైన జీవితానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా భావించుకునే స్థితివుంది. ఇదంతా కథకురాలి రచనాశిల్పం వల్లనే సాధ్యమైంది. స్థలకాలాల పరిమితుల్నిదాటి పరిశీలించిన కథలుగా మాత్రమేకాక, మనిషి అంతర్లోకాల సంఘర్షణని రచయిత్రి ఆవిష్కరించడం ఇందువల్లనే సాధ్యమైంది.
ప్రత్యేకంగా ఇందులోని స్త్రీ పాత్రల గురించి ప్రస్తావించాలి. ‘విందుతర్వాత’… కథలోని మాధవి, ‘సౌందర్యీకరణహింస’లో అరుణ, ‘గూడు’లో చందన, ‘గంగకు వరదొచ్చింది’లో గంగ, ఈ  పాత్రలు తమచుట్టూ జరుగుతున్న అన్యాయాల్ని చూడలేక ప్రశ్నించడానికి ఉద్యుక్తమయ్యే పాత్రలు. మాధవి ఆదర్శంగా చూపబడుతున్న అంశాల్లోని చీకటి కోణాల్ని అసహ్యించుకుంటుంది. తెచ్చిపెట్టుకున్న ఔదార్యాలలోని డొల్లతనాల్ని, మానవత్వం పేరుతో చెలామణి  అవుతున్న అంశాల్ని చర్చలోకి తెస్తుంది. చందన-అరుణల పద్ధతి కూడా ఇదే! ఇళ్ళు కట్టించే ప్రభుత్వపథకాలవల్ల సగటుమనిషి ఎదుర్కొంటున్న సమస్యలు, నీడకోసం పాకులాడుతూ, కూడే లేని పరిస్థితిలోకి నెట్టబడటం వంటి సూక్ష్మమైన అంశాలవైపు చందన దృష్టి మరల్చి, చర్చలోకి తెస్తుంది.
‘అరుణ’ మనిషితనంపై లేవనెత్తిన ప్రశ్నలు సామాన్యంగా అనిపించినా సామాన్యమైనవి మాత్రమే కావు. కనీసవసతులు కరువైన జీవితాలవైపు దృష్టి సారించమనే విషయాన్ని చర్చకు పెట్టడంతోపాటు, ‘అభివృద్ధి’ నినాదంతో సాగుతూ ప్రభుత్వాలు ఏయే వాస్తవకోణాల్ని విస్మరిస్తున్నాయో చూపడం అరుణలోని అసలు లక్ష్యం. ఆ లక్ష్యం కోసం గొంతెత్తడం మినహా మరోదారి లేదంటుంది. ‘గంగ’ పాత్రలోని సంఘర్షణ నుంచి చర్చకు వచ్చే అంశం, స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నంలోని అడ్డంకులు. పథకాలు ఎంతగా స్త్రీలలోని మానసిక ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయో చూపుతాయి. అంతే కాకుండా, తరతరాలుగా స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కావాల్సిన మానసికప్రపంచం సంసిద్ధమై లేకపోవడం, అందువల్ల ఎదురవుతున్న పరిస్థితులు. అటువంటి స్థితి వల్ల ఒకడుగు ముందుకు వేసినట్లు కన్పిస్తుంది. ఈ కథలో గంగ, ఆదెమ్మ వంటివారు ఎదుర్కొన్న పరిస్థితులు ఇందులోని భాగమే. డ్వాక్రా పథకంలో ముందుకు వేసిన అడుగులు, మైక్రోఫైనాన్స్‌ విషయంలో అవగాహన కొరవడటం వల్ల వెనకడుగులు వేయడం గమనించవచ్చు. స్త్రీలకు నాయకత్వ నైపుణ్యం వున్నా, అవగాహనచైతన్యం రూపుదిద్దకుండా, పథకాల్ని ప్రవేశపెట్టడం వల్ల ఏర్పడే దుష్పరిణామాల్ని గంగ మానసికసంక్షోభంలో చూడవచ్చు.
ఈ పాత్రలు సామాజిక అంశాలను చర్చకు పెట్టినవి అయితే, స్త్రీల జీవితాల్లోని అంతర్లోకాలను, పాలపుంతలోని మధుర, ‘చీకటిలోంచి చీకటిలోకి’ లోని ఊర్మిళ. ‘ఐతే’ లోని జానకి పాత్రలలో చూడవచ్చు. హెచ్‌.ఐ.వి. బారిన పడిన మధురలోని మానసిక పరిపక్వత, స్త్రీపురుషుల మధ్య నెలకొనాల్సిన అపురూపమైన ప్రేమను నిర్వచించగలిగిన స్థిరచిత్తం అబ్బురపరుస్తాయి.
”సంతోషం ఎప్పుడూ మన చుట్టూనే వుంటుంది. దాన్ని గుర్తించడంలోనే వుంది మన తెలివంతా” అంటుంది - ‘మధుర’. జీవితంలో తగిలిన ఎదురుదెబ్బల్ని కూడా మరిచిపోయేంత జీవననానుకూల దృక్పథం ఈమెలో తొణికిసలాడుతుంది. అందువల్లే తనలాగే వ్యాధి బారిన పడిన -వయసులో తనకన్నా చిన్నవాడైన యువకుడితో సహజీవనం చేయడం కోసం సన్నద్ధమైంది. ఆత్మవిశ్వాసప్రతీకగానే కాక, జీవితపు ఆర్ద్రమైన ఆత్మీయకోణం ఏమిటో ఈమె మాటల్లోంచి కూడా ఆమె జీవనానందాన్ని ప్రోది చేసుకో గలుగుతుంది. ‘చీకట్లోంచి చీకటిలోకి’లో ఊర్మిళ ఆచారవ్యవహారాల వ్యవస్థలోని లోపాలను, తప్పనిసరితనంలోని విసుగును కప్పి పుచ్చుకుని కుటుంబం కోసం నిలబడుతుంది. పైకి నోరెత్తకుండా వున్నట్లువున్నా ఆమెలో లోలోపలి పెనుగులాటను, కుటుంబవ్యవస్థలో స్త్రీ స్థితికి ప్రతీకగా చూడవచ్చు. ఏ భర్త క్షేమంకోసమైతే తాను అనారోగ్యంగా వున్నా, వ్రతం చేసిన నాగలచ్మి, అదే భర్త చేతుల్లో దెబ్బలు తిని చనిపోతుంది. ఇవన్నీ నేటి స్త్రీ పరిస్థితికి వాస్తవరూపాలు. ఆచార వ్యవహారాలోని లొసుగుల్ని చూపడంతో పాటు, అందులో భాగంగా స్త్రీల మానసికతను దర్శింపచేయడం ద్వారా కథాలక్ష్యం నెరవేరింది.
‘ఐతే- కథలో జానకి పాత్ర స్త్రీవాదప్రతీక. తమ ప్రేమ రాహిత్యంతో బతుకువెళ్ళమార్చలేక పెనుగులాడుతున్న స్త్రీలకు ప్రతీక. తాను యిష్టపడిన బాలసుబ్రహ్మణ్యంతో అరవై ఏళ్ళవయసు వచ్చినా, జీవితం పంచుకోవడానికి సిద్ధపడుతుంది. దీనివెనుక గడిచిన జీవితసంఘర్షణ వుంది. భార్యగా తాను పడిన మానసికసంక్షోభం వుంది. పురుషుడి వైపే అన్ని వేళలా మొగ్గు చూపే సమాజవ్యవస్థ ప్రభావం వుంది. పురుషుడి లోపాలను కూడా సహించగలిగిన సానుకూలవ్యవస్థ వుంది. పురుషుడికి లేని, స్త్రీకి మాత్రమే వర్తింపజేసే  నీతిసూత్రాల వల్లింపు వుంది. వీటన్నింటినీ నిరాఘాటంగా అమలుపరిచే పితృస్వామిక అధికారపు హంగువుంది. వీటిని ఎదిరించే తెగువను జానకి ప్రదర్శించి, దానివల్ల ఎదురైన కష్టనష్టాల్ని ఎదుర్కొని, ఒక్క కూతురుతప్ప తనకు తోడు నిలవని స్థితిలో సైతం తాను కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతుంది. కూతురి అండ కేవలం ఆ సందర్భంలోకి పరిమితమై చూడలేం. స్త్రీ ముందడుగులోని భవిష్యత్తును దర్శింపచేసిన ప్రతీకగా కూతురిని చూడాలి.
స్త్రీవాద ఉద్యమం లేవనెత్తిన అంశాలు, ఉద్యమించిన సందర్భం, స్త్రీ స్వేచ్ఛ కోసం ఎడతెరిపి లేకుండా జరుగుతున్న చర్చల నేపథ్యం - ఈ కథకు ప్రేరణలు. సత్యవతి ఈ కథను ముగించిన తీరు ప్రశంసనీయం. తరాల తర్వాత స్త్రీ సగర్వంగా నిలదొక్కుకునే స్థితికి చేరుకుంటుండడం వెనుక వున్న సంఘర్షణకు అద్దం పట్టింది ఈ కథ.
”నేను దుఃఖంలోంచి సుఖంలోకి, స్వేచ్ఛలోకి వెళ్ళాలను కుంటున్నాను. నన్ను ఆపకండి. నాకు విడాకులు కావాలి” జానకి 60 ఏళ్ళుగా తనలో దాచుకున్న పెనుగులాటలోంచి సాధించుకున్న స్వేచ్ఛకు ప్రతిరూపమైన మాటలివి. ఈ మాటల సారాంశం స్త్రీవాద ఉద్యమం ఎగరేసిన బావుటా.
‘ఎగిసిపడిన కెరటం’ - కథ ఒక ఉద్వేగతరంగమే. మనం కూడా అనసూయత్త జీవితంలోకి నేరుగా ప్రవేశిస్తాం. సంఘర్షిస్తాం. విచలితులమవుతాం. పరిష్కార మార్గంతో ఏకీభవిస్తాం. అలాగే, ఆదర్శాలు కరిగిపోయి రమేష్‌లోని అసలురంగు బయటపడినప్పుడు భార్యగా కొనసాగలేననే నిర్ణయం తీసుకున్న అరుణ, ఆ నిర్ణయం తీసుకోవడంలో చూపిన తెగువ ‘మెలకువ సందర్భం’ కథలో కన్పిస్తుంది. ఎక్కడా తన జీవితం మీద తనకు నమ్మకం లేనితనం కన్పించదు. అలాగని భవిష్యత్తులో ఏమైపోతానో అనే దిగులులేదు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడేతనం అరుణలో నిండివుంది. అందువల్లే జానకిలా జీవితచరమాంకం వరకూ ఎదురుచూడకుండా తాను ఎదుర్కొంటున్న సమస్య ఏమిటో తక్షణమే అవగాహన చేసుకుని, దాని కనుగుణంగా తాను తీసుకోదగిన నిర్ణయం వెనువెంటనే తీసుకొంది. ‘హమ్‌ చలేంగే సాథ్‌ సాథ్‌’లో కలిసి జీవించడానికి ముందే, చర్చించుకోవడం, జీవనసాఫల్యాన్ని సాధించుకున్నదిశగా పయనించడం స్పష్టంగా కన్పిస్తుంది. తరాలు మారుతున్న కొద్దీ స్త్రీ మానసికంగా దృఢమవుతున్న పరిణామాన్ని ఈ మూడు పాత్రల్ని విశ్లేషించుకుని రూఢిపరచుకోవచ్చు.
స్త్రీవాద దృక్పథంతో, చైతన్యంతోవున్న ఈ కథల్లోని స్త్రీలు, పిరికివాళ్ళు కాదు. సర్దుకుపోయే గుణాలు లేవు. ప్రశ్నించడం నేర్చుకున్న వాళ్ళు. గొప్ప చైతన్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంకోసం, స్వేచ్ఛకోసం, తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోగలిగే తెలివైన స్త్రీలు, బుద్ధిజీవులు, అంతర్గతచైతన్యాన్నుంచి, ఘర్షణ నుంచి జీవితసాఫల్య నవనీతాన్ని సాధించుకున్న ధీరవనితలు. సమాజంలో నేడున్న స్థితిలో స్త్రీలు తమతమ జీవితాలను మణిదీపాలుగా వెలిగించుకోవడమే కాక, తోటి స్త్రీల బ్రతుకుల్లో కూడా ఆత్మవిశ్వాసం తొంగిచూడాలనే ఆకాంక్షను ధ్వనిస్తాయి ఈ కథలు.
కొండవీటి సత్యవతి కథకురాలుగా చూపిన పరిణితిని ఈ పై కథల్ని చర్చించడం ద్వారా ఎత్తిచూపడం నా ఉద్దేశ్యం. అంతేకాక చర్చనీయాంశాలైన అనేక సమస్యల్ని ఈమె కథావస్తువులుగా ఎంచుకొని, ఏరుకున్న సంకేతాలుగా ప్రదర్శించి చూపారని చెప్పడం మరో ఉద్దేశ్యం.
‘భూమిక’ స్త్రీవాదపత్రిక సంపాదకురాలుగా, హెల్ప్‌లైన్‌ నిర్వాహకు లుగా మహిళా ఉద్యమంలో భాగస్వామిగా దశాబ్దిన్నర కాలంనుండి పనిచేస్తూ వికసనం చెందిన మానసిక ప్రపంచాన్ని ఈ కథల ద్వారా ముందుకు తెచ్చారు కొండవీటి సత్యవతి. ‘ఉత్తమ జర్నలిస్ట్‌ అవార్డ్‌’, సంపాదకీయాలకు ఉత్తమ ‘లాడ్‌లీ’ అవార్డ్‌, జెండర్‌ సెన్సిటివిటీకి ‘నేషనల్‌’ అవార్డ్‌, ‘ఆమెకల’ కథాసంపుటికి ‘ఉత్తమరచయిత్రి’ అవార్డ్‌ (తె.యూ.) రంగవల్లి అవార్డ్‌ వంటి ఎన్నో ఈమె సాహితీకృషికి మచ్చుతునకలు మాత్రమే.
పరిణిత దృక్పథంతో పాటు, అనువైన రచనాశిల్పంవల్ల ఈ కథల్లో వస్తువుగా తీసుకున్న అంశాలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. చర్చను ప్రేరేపిస్తాయి. కథలలోని వస్తువులు సుపరిచితంగా కన్పించినా, వాటిని మలిచిన తీరువల్ల ‘అట్టడుగున కాన్పించని కోణాలెన్నో దర్శించే అవకాశం ఈ కథలలో కలిగింది. జానకి, మధుర, వసుధ, చందన. వసంత, అనసూయ, ఊర్మిళ, సంహిత, నాగలచ్మి, విశాల, అరుణ పేరేదైతేనేం? అందరూ ఒక్కరూపాన్ని ఒకే రకమైన బాధని, ఒకేరకమైన వివక్షని, అణచివేతని, ఒక రకమైన భావజాలాన్ని తొడుక్కొని మనముందున్న అసలు సిసలైన ప్రతీకలు. మీరూ ఓ సారి వాళ్ళ ఈ జీవితపు మారుమూల పార్శ్వాలను చూద్దురుగాని రండి. వాళ్ళే మీకు సమస్తాన్నీ వివరించుకుంటూపోతారు.

Tuesday 16 August 2011

కొత్త ఇళ్ళు కట్టుకుందాం

ఆమె ఒక మతం
అతడు ఒక మతం
కాలాతీత మతాతీతం అభిమతం
మధ్యన ద్వీపంలా సంతానం

మోహావరనంలా తప్పిపోయిన  శరీరం
జీవితంలోంచి తొంగిచూస్తుంది
జనాభాలెక్కల్లో తేలని మతాలమధ్యన
ఒక మతంగా జన్మెత్తాడు ఓ శరీరాన్ని పంచుకుని -

ఈ చిన్నారి ప్రశ్నలకు
హిందూ,ముస్లిం,సిక్కు గడుల 'సెన్సెస్ చార్టు'
జవాబులకోసం వెతుక్కుంటుంది
దొరకని జవాబులకోసం
చిన్నారి జీవితాంతం అన్వేషించాలా?
ముఖం చెక్కేసిన'బహామియన్' బుద్దుడిలా
మతముఖంలేని నా రక్తంలో రక్తం.....

ప్రేమికులారా!
మోహంలోనూ  మతాన్ని చూడండని ఇక ఉద్యమాలు లేవదీద్దాం
మతాల్నే ప్రేమించమని దేహాలతో మొరపెట్టుకుందాం
ముఖం వెనుక దాగిన చూపులకు
మతకచ్చడాలు బిగించమని మతపెద్దల్ని అడుగుదాం

దేహంకూడా ఒక మతమేనని చాటుదాం

మృత్యువులోంచి కూడా కళ్ళు తిప్పుతూ
ప్రశ్నించడం మానని మతం !

దంపతులారా!
మన ప్రేమలకు ఈ ఇళ్ళు చోటివ్వలేవు
మన ఇళ్ళు మనమే నిర్మించుకుందాం.

@.@
                                                                                     

Friday 5 August 2011

గోరటెంకడి పాట

వాగ్గేయకారులెలా ఉంటారు !?
చింతాకంతే వుంటారు 
చిరస్మరనీయులై నిలుస్తారు 

ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య
ఒక త్యాగయ్య, ఒక మీరా 
ఇదిగో ఇక్కడ 
తెలంగాణా భూమిని తొలుచుకుని గోరటి వెంకన్న!

అతడి నోటినిండా పల్లెపదాలు
పాట ఎత్తుకుంటే పల్లె మన ముంగిట నిలుస్తుంది 
పదబంధాలు,ప్రతీకలు బంతిపూలై నవ్వుతాయి.
కళ్ళు ఎగిసిన అలలై మెరుస్తాయి 
ఊరుతల్లి ఇంటిముంగిట ముగ్గవుతుంది 
చెట్టూ చేమా , కాయాకసరూ 
ఉప్పూనిప్పూ కరువూ కష్టం
చేలెంబడి ,డొంకలెంబడి తిరుక్కుంటూ పాటల్లా నడుస్తాయి 

ఊరోళ్ల ఊసులు సంతలకధలు వెతలు రాములయ్య బతుకుభాగోతాలు హరిశ్చంద్రుడి కాటికాపరి దుక్కం 
కన్నీరొక చుక్కుండిన చాలునన్న వేదాంతాలు ఆలుమగల్ల రాద్దంతాలు సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మలు 
డెంకదేడ్డెం 'అంటూ లేగాదూడలైన పిల్లకాయలు కనిపించని కుట్రల్లో పల్లెకన్నీరు పెడుతుందని దృశ్యమానం 
చేసే పాటల మాటల ఊటల ఆవేదనార్తుల కలబోతల ఒక అనంత ప్రవాహం ఆతడి పాట.చదువుకున్నోళ్ళ
ఉన్నోళ్ళ ,ఉన్నున్నోళ్ళ నోటెంట పలికే గిలికే రాతలే నిజమంటున్న కాలంలో -బతుకుబండిలో పల్లెనేక్కించిన
జానపద సాహిత్య రారాజు అతడు.

అతడొక ఉద్యమం ,అతడొక ప్రవాహం ,పరీవాహకం
అతడి గుండె ఒలికిన పాట పోటెత్తిన అల
'వేమన'లా ప్రతీకలని చుట్టూ చూస్తూనే 
ఒడిసిపట్టుకుని విత్తనాల్లా వెదజల్లుతాడు 
చరణాల నాగటిచాల్లలో ఏం పోలిక రువ్వుతాడో తెలీదు
ఎవరి గుండె పిగులుతుందో తెలీదు 
అతడినోట ప్రతి పాట ఓ బతుకుగుండం ,జీవన్మరణ పోరాటం
అంతర్గత సంక్షుభిత విలయనృత్యం

తెలంగాణ కన్నమట్టిబిడ్డ,మరో బిడ్డ 
కన్నతల్లి కనుకొలకులలో మెరుపై నిలిచే నెత్తుటి గుండం!

Saturday 30 July 2011

చూపులు

కన్ను తడిగుండెల మడతల్ని
విప్పుతూ వుంటుంది 
ఆ రెప్పలకు 
బతుకుమూత మూయడమూ తెలుసు 

కన్రెప్పల దారాలతో 
ఒక్కొక్క గాయాన్ని కుట్టుకోవడమూ తెలుసు 
అంతరంగ యుద్దాల్లో 
నెత్తురోడిన జీరల్ని దాచుకోవడమూ తెలుసు 

నల్లటి అశాంతుల ఆవర్తనాల్ని 
శ్వేత బిందువులతో సమర్ధించడమూ తెలుసు 
1
చంక్రమనాలు చేసే బతుక్కి
చూపై, స్థిరమై, నిలిచే అభివ్యక్తి .
ఎదురు చూపుల్లోంచి ,బతుకు చూపుల్లోంచి 
బతుకంతా ఎదురుచూడ్డం అంటే 
ఒక జీవిత సాఫల్యం చేకూరినట్లు -

అలజడుల ఊపిరుల నడుమ 
కాలాన్ని కొలవడం ఒక యుద్దమే!
అశాంతి మాత్రమే చూపుల్లోంచి కరుగుతుంది ,
కాలాన్ని కదుపుతుంది 
ఎడారుల నిశ్శబ్దం 
ఎండుటాకుల పైనుంచి లేచిన చిరుశబ్దం
ఊపిరినుంచి ఎగిసిన నిట్టూర్పు-
                            అన్నీ చూపులే! 
అన్నట్టు, లోచూపు ఇప్పుడే వెలిగింది.
అన్నీ -చిత్రాలే ఇక !!!


+ + +

Thursday 21 July 2011

ప్లాస్టిక్ ! ప్లాస్టిక్ !!

ప్లాస్టిక్ నవ్వులు,ప్లాస్టిక్ పువ్వులు 
అలవాటైన మనం సహజత్వానికి దగ్గరవ్వాలంటే కష్టమే !
టీ గ్లాసుల్లో కరిగి కరిగి
కడుపులో మేటలైపోయినా ఫరవాలేదు .
గడ్డి దొరక్క రోడ్లమీద  ప్లాస్టిక్ కవర్లు కడుపార తినే పాడిఆవులు
నాయకులు తినేసిన గడ్డిని తలచుకుంటూ 
నెమరు వేస్తుంటాయి 
వాల్ పోష్టర్లు ,ప్లాస్టిక్ కవర్లు కసాపిసా నమిలేసే 
పశు పక్ష్యాదులు మనం సాధించిన అభివృద్ధికి కొలమానాలు.
ఆ పైన మనకోసం అవి గాలిలోంచి, నీటిలోంచి 
ధూళిలోంచి మిగిల్చిన వాటిని 
క్యాన్సర్ కానుకలుగా స్వీకరిస్తూ సంతోషపడాలి.
 
వేడి వేడి పాయా,బిర్యాని,చాట్ 
ప్లాస్టిక్ కవర్లలో కరిగి కరిగి వింత రుచులతో ఆరగిస్తే 
అదో ఆనందం ...
ప్లాస్టిక్ గరగరల శబ్దం 
గుండెను దడ దడలాడిస్తున్నా వేరే ఆలోచనను కూడా 
ఆహ్వానించం ! - ప్లాస్టిక్ బతుకులు కదా మనవి!!!
అసలైన రుచులు అంటే ఏమిటో 
ఇప్పుడు ప్లాస్టిక్ నే అడగాలి.

తెలిసి తెలిసి చేస్తున్న తప్పుకు 
ప్లాస్టిక్ కు  ఏ మాత్రం భాద్యత.
నిజమైన స్పర్శను,భాషను ,అనుబంధాల్ని 
ప్లాస్టిక్ గా మార్చుకున్నదే మనం.

ఇప్పుడు భూమిని ప్లాస్టిక్ తో నింపి 
జీవసారాన్ని జీవంలేకుండా మార్చేస్తున్న 
ప్లాస్టిక్ మనుషులం మనం. 
మనం ప్రేమించే మట్టిని ,పీల్చే గాలిని ,తాగే నీటిని 
స్వచ్చంగా బతికేటట్లు 
ప్లాస్టిక్ రహిత భాషలో సంభాషిద్దాం...

Friday 15 July 2011

త్యాగమూ నేరమే!

దేహమొక కాంతిపేటిక

ప్రాతః సంధ్యలు సహజ మాతృవాత్సల్యాలతో
వాంచా సామీప్యాలను దూరం చేస్తాయి

ముంగిట తీర్చిన ముగ్గులు
స్వరాలను మెలికలు తిప్పుతూ
నిద్రిస్తుంటాయి

ప్రతి ఘడియా ప్రేమానుభవం కోరుతుంది
లోపల రక్తం సృజనగీతాన్ని రాస్తుంటుంది
నుదుట కుంకుమ
మెడ గంధం
అనుభవాల అర్ధాలను ప్రదర్శిస్తుంటాయి

ప్రేమ-ఒక తనివితీరని ఋణం
రుణగ్రస్తమైనదేదీ మనసును ఒదలదు

ఒక జ్ఞాపకపుతీరాన
తచ్చట్లాడుతూ అతడి ఉత్తరం

ప్రేమ-స్వలాభమే!
త్యాగమూ నేరమే!!

Friday 8 July 2011

వెలిసిన భ్రమలు

m.f.hussain painting
రంగులు వొలికిపోయాయి
చుట్టూ ఎటుచూసినా రంగులముద్దలు
ఏరుతున్న నాచుట్టూ గడ్డకట్టిన రంగులముద్దలు

అన్ని రంగుల్ని కలిపేసినా ఒకే రంగు
అన్ని భావనల్ని కలిపేసిన ఒకే అనుభూతి
చిట్లుతున్న అనుభూతి పొరలు
పిగులుతున్న దుక్కం
పగిలిన సీసాను నిమిరినప్పుడల్లా
సర్రున కోసేస్తూ గాయాల నృత్యం

అదురుతున్న పెదాలమధ్య
చెదురుతున్న విశ్వాసాల ఊపిరి.
*

                                                                         26 నవంబర్ 1999
                                              ఎంతెంత దూరం 'కవితా సంపుటి నుండి ...

Monday 4 July 2011

పంజరం

పంజరాన్ని నేనే 
పక్షినీ నేనే
నాకు నేనే ఉచ్చును బిగించుకుంటాను
చిలుకపలుకులే తెలుసు
గొంతెత్తి పాడలేని మూగజీవాన్ని
కవిత్వం రాయాలని సమాజపు పక్షపాతాన్ని నిరసించాలని 
నాలోని కోటానుకోట్ల కణాల యుద్దారావాల్ని 
నాలోని విద్యుత్ ప్రవాహ గీతాన్ని 
నాలోని ఆలోచనా లోచనాల సముద్రాల్ని వెలికితీసి 
నాలోని నన్ను ఆవిష్కరిద్దామనే నా భావన.

కలలున్నాయి ,కాని అన్నీ డొల్లలే-
కథలున్నాయి,కాని ఎవరో పూర్తిచేసిన ముగింపులే-
కనులున్నాయి,కానీ ఎవరో కత్తిరించిన రేటీనాలే
  
సమాజంలో బతకని నువ్వు 
నీ పుట్టుకా  సమాధి పంజరమే అయిన నువ్వు 
పంజరం ఊచలెన్నో లెక్కెట్టుకో !
కవిత్వం కవులే రాయగలరు-
      నీకు అక్షరాలు ఏం తెలుసునన్న పురుషాహంకారం .
అవును! నాకు అక్షరాలు తెలియవు.
వాటి పోడిమాటలూ తెలియవు .

అసలు అక్షరాలేవి?
అయ్యో! వాటికి ప్రాణం ఏదీ?
ఎర్రటి రక్తంలో స్నానాలు చేస్తున్నాయవి !
వెలికి తీద్దామన్న యత్నంలో నా వేళ్ళు తెగి ఆ రక్తంలోనే కలిశాయి. 

చేతులే లేని నేను 
హత్యచేయబడ్డ  అక్షరాలతో నేను 
అసలు బాషే లేని నేను ఎలా మాట్లాడేది? ఎలా రాసేది?
***
నాచేతికి "మాడిఫై "చేయబడిన రూపంలో  గాజులసంకెలలు
నా గొంతులో మూగే జూకాల్లా  శబ్దాలు 
నా బతుకే ధన్యమనే  ''బ్రెయిన్ వాష్'' లు

నా నాలుక తెగ్గోసినా ,చేతుల్ని నరికేసినా 
అక్షరాల్ని విరిచేసినా ,అసలు భాషను దగ్ధం చేసినా 
నేను మరణించ లేదు.
నేను మరణించను
అవును! ఈ నెత్తుటిలో కొత్త పుట్టుక నాది.
ఈ పుట్టుక నా స్వంతం. 
జనన మరణాల పట్టికను నేనే తయారు చేసుకోగలను !
ఎవరికీ నన్ను కాల్చడానికి ,కూల్చడానికి ,ముంచడానికి 
వదిలేయడానికి ,ఉంచుకోవడానికి ,చంపడానికి ,ఎంచుకోవడానికి 
సర్వహక్కులూ ధారాదత్తం చేయబడలేదు.

నేను వైప్లవ్య గీతిని...
మూగతనం తెలిసిన నాకు భాషెంత బాగుంటుందో తెలుసు.
కష్టాలలో మునిగి తేలిన నాకు కడసారి వీడ్కోలు కొత్త కాదు.
కన్నీళ్ళ నదులకి ఆనకట్టలు కట్టి 
కొత్త వంతెనలు కట్టడం తెలుసు!
*** 
నేనొక ప్రాణినేనన్న గుర్తింపుకోసం 
నేనొక సమిధగా కూడా మారతాను.
నన్ను నేనే నిలబెట్టుకోనేక్రమంలో 
నా పాదాలక్రింద ఇసుకల జారిపోతున్న కుబుసాన్ని త్రునీకరిస్తున్నాను .
***     ***
భాషను దూరం చేసిన  ప్రణాళికా కారులకు 
నేనొక కొత్త నిఘంటువును!
బతుకును చౌరాస్తాగా మార్చిన వ్యాహహారికపు ముసుగులకు 
నేనొక కంచు కత్తిని!
నేను తెగినా ,నేలరాలినా ,నెత్తురు చిమ్మినా 
నేనొక మాట్లాడగలిగిన శక్తిని' అని నిరూపించుకుంటాను.
పోరాడటం నాకు కొత్తకాదు.
చాళ్ళనిండా విత్తనాలు మొలకెత్తడం ఇప్పటికే మొదలైంది !!

1999 












 

Sunday 3 July 2011

కొత్తకోణం

చెట్టుకు అల్లుకుని పాకుతున్న తీగెలా 
ఎండపొడ తగిలి మెరిసే నేలలా
ప్రేమను చుట్టుకుని మెరుస్తున్నాను

అలలు విరిగి ముక్కలై 
సముద్రంలా పరుచుకున్న వాస్తవం ముందు
మట్టిముద్దలా నిల్చున్నాను 
నాలోని చెట్లను,తీగెల్ని,ఎందపోడల్ని,నేలని 
ప్రేమని ధరించే కళ్ళనూ 
దేనికది విడదీసుకుంటూ ,లోపలికి తొంగిచూసుకుంటూ
రూపం ధరించని మట్టిముద్దలానే
           ఇంకా ఇలానే మిగిలి ఉన్నాను 

నాలోపలికి దూసుకొచ్చే యుద్దాలు 
నన్ను బంధించే స్త్రీత్వాలు
నన్ను వర్ణించే 'సహనవతి'' ప్రతీకలు

గంభీరమైన సముద్రం ముందు హోరెత్తుతున్నాను
అలలా విరిగి పడుతున్నాను ,ఎగుస్తున్నాను
చెదరి చెదిరి తుంపర్లుగా మారిపోతున్నాను 
నన్ను చూడని చరిత్రలో
నన్ను కన్నెత్తనీయని కబోధిధర్మాలు
నాకే ముఖమూ లేకుండా చెక్కేసిన చెక్కడాలు 

మళ్ళీ నేను మట్టిముద్ద లోంచి 
మానవి రూపంలోకి  ప్రయానిస్తున్నాను 
వ్యక్తీకరణ  నా కొత్త కోణం ...!

                               "ఎంతెంత దూరం"  కవితా సంపుటి నుంచి ,2005

shilalolitha

 ప్రముఖ కవయిత్రి రేవతీదేవి కవితా సంకలనం పేరు "శిలాలోలిత".
ఆ సంకలనం పేరునే నా పేరుగా ఎంచుకున్నాను.